Telugu Updates
Logo
Natyam ad

వార్డెన్ నిర్వాకానికి నిండు ప్రాణం బలి

వార్డెన్ నిర్వాకానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్, రాధ దంపతులకు కుమారుడు మారం శ్రీకర్ పాఠశాల ఆవరణలోని బావిలో జారిపడి గల్లంతయ్యాడు.

చెత్త తీయాలంటూ ఆరుగురు విద్యార్థులను బావిలో దింపిన వైనం

ప్రమాదవశాత్తు లోపలికి జారిపడి ఓ విద్యార్థి మృతి

శ్రీకర్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఆంజనేయులు న్యూస్, కరీంనగర్ జిల్లా: వార్డెన్ నిర్వాకానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. విద్యార్థులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్, రాధ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ లో డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తూ అక్కడే భార్య, కుమార్తెతో ఉంటున్నారు. కుమారుడు మారం శ్రీకర్ (13) తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో అమ్మమ్మ వద్ద ఉండి ఓ ప్రైవేటు పాఠశాలలోని హాస్టల్లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం పాఠశాల ఆవరణలోని బావిలో చెత్త తొలగించాలంటూ శ్రీకర్ తో పాటు అయిదుగురు విద్యార్థులను వార్డెన్ బావిలో దింపాడు. అనంతరం మిగిలిన విద్యార్థులు బయటకు రాగా శ్రీకర్ బావిలో జారిపడి గల్లంతయ్యాడు. తోటి విద్యార్థులు అరవగా వార్డెన్ ఘటన స్థలం నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి శ్రీకర్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం వద్ద శ్రీకర్ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఘటనపై ఫిర్యాదు అందాల్సి ఉందని, స్కూల్ యాజమాన్యం అందుబాటులో లేదని ఎస్సై ప్రమోద్ రెడ్డి పేర్కొన్నారు.