Telugu Updates
Logo
Natyam ad

కాసేపట్లో వివాహం.. పెళ్లికుమార్తె ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా నవీపేటలోని ఓ పెళ్లింట్లో విషాదం నెలకొంది. కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆంజనేయులు న్యూస్, నిజామాబాద్ జిల్లా: నవీపేటలోని ఓ పెళ్లింట్లో విషాదం నెలకొంది. కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్సై రాజారెడ్డి, యువతి బంధువుల కథనం ప్రకారం.. నవీపేటకు చెందిన రాగల రవళి (26)కు నిజామాబాద్ కు చెందిన ఓ యువకుడితో ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు నిజామాబాద్ లోనీ ఓ ఫంక్షన్ హాలులో వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి కుమార్తె తమ ఇంట్లోని స్టోర్ రూంలో ఉరివేసుకుని బలవనర్మరణానికి పాల్పడింది. స్టోర్ రూం గది తలుపులు తెరిచి ఉండటాన్ని యువతి తండ్రి ప్రభాకర్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాబోయే పెళ్లి కొడుకు శనివారం రాత్రి 10.30 గంటలకు తమ కుమార్తెకు ఫోన్ చేశాడని. అతడు పెట్టిన మానసిక క్షోభతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెళ్లికుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ఈ ఘటనతో బంధువుల, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇటీవల జరిగిన మెహందీ ఫంక్షన్ లో డ్యాన్స్ చేసి ఉత్సాహంగా గడిపిన రవళి.. ఆత్మహత్యకు పాల్పడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.