Telugu Updates
Logo
Natyam ad

రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించిన కేంద్రం

రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్ (బీహెచ్) సిరీస్ నంబర్లను పొందడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.

పాత వాహనాలూ భారత్ సిరీస్ కు మారొచ్చు

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్ (బీహెచ్) సిరీస్ నంబర్లను పొందడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ మేరకు బీహెచ్ సిరీస్ నిబంధనలను మార్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. బీహెచ్ సిరీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కొత్త వాహనాలు మాత్రమే బీహెచ్ సిరీస్ తీసుకోడానికి వీలుండేది. ‘అవసరమైన పన్ను చెల్లింపులు చేసి సాధారణ రిజిస్ట్రేషన్ మార్కు ఉన్న వాహనాలు సైతం బీహెచ్ సిరీస్ కు మారొచ్చ’ని కేంద్రం పేర్కొంది. నివాసం ఉంటున్న లేదా పనిచేస్తున్న ప్రాంతంలో, తమ వాహనం కోసం బీహెచ్ సిరీస్ దరఖాస్తు సమర్పించేందుకు వీలుగా ‘రూల్ 48’ను సైతం సవరించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయకుండా ‘వర్కింగ్ సర్టిఫికెట్ ‘ను ప్రైవేటు రంగ ఉద్యోగులు సమర్పించాల్సి ఉంటుంది.
ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి నుంచి మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి వ్యక్తిగత వాహనాల బదిలీ సులువుగా ఉండేందుకు, గతేడాది సెప్టెంబరులో సరికొత్త రిజిస్ట్రేషన్ ‘భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)’ను కేంద్రం అమల్లోకి తెచ్చింది. ‘నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న రక్షణ రంగ సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ రంగ/ప్రైవేటు రంగ సంస్థలకు బీహెచ్ సిరీస్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందువల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు, మళ్లీ వాహన రిజిస్ట్రేషన్ చేయించే శ్రమ నివారించినట్లు అవుతుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా 49,600 వాహనాలు భారత్ సిరీస్ కింద రిజిస్టర్ అయ్యాయి.