Telugu Updates
Logo
Natyam ad

పెండింగ్ లో ప్రభుత్వ ఉద్యోగుల డి.ఏ

ఆంజనేయులు న్యూస్,  తెలంగాణ: అనుకున్నదొక్కటే అయింది ఒక్కటి అన్నట్లుగా తమ పరిస్థితి మారిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. వారితోపాటు కార్మికులు, పెన్షనర్లు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొత్త హామీలు దేవుడెరుగు ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీలనూ అమలు చేయడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సంఘం అనుమతించినా గతంలో కేసీఆర్‌ విడుదల చేసిన డీఏను చెల్లించేందుకూ కాంగ్రెస్‌ సర్కారుకు చేతులు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయంగా దక్కాల్సిన సౌకర్యాలను కల్పించకపోగా ‘మీరే చూస్తున్నారు గా..’ అని నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తామిచ్చిన వినతలు సంబంధిత శాఖలకు చేరేవని, ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించేవారని, ఇప్పుడా పరిస్థిథి లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎంకు, మంత్రులకు సమర్పించిన వినతి పత్రాలు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థమే కావడంలేదని చెప్తున్నారు. అసలు మంత్రులు తామేం చెప్తున్నామో కూడా వినకుండానే ‘ఓకే.. చూద్దాం.. చేద్దాం’ అంటూ కాగితాలను పారేస్తున్నారని అంటున్నారు. బదిలీల విషయంలో ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేకుండాపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇక విద్యాశాఖ విషయానికి వస్తే అప్పటికప్పుడు 317 జీవో పై మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే వేశారు. కానీ, దానిపై ఏం చేయబోతున్నారో అన్నదానిపై సర్కారుకు ఇంకా స్పష్టత రాలేదని ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరి ఆరు నెలలు కావస్తున్నా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న హామీల్లో తక్షణం పరిష్కరించగలిగిన వాటినైనా అమలు చేయడం లేదని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.