Telugu Updates
Logo
Natyam ad

లాలూకి కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె..!

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ మార్పిడిని జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్యా కిడ్నీని లాలూకు అమర్చనున్నారు.

ఆంజనేయులు న్యూస్, బీహార్: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని లాలూకు అమర్చనున్నారు. రోహిణీ సింగపూర్ లో నివసిస్తున్నారు. లాలూ అక్టోబర్ లో సింగపూర్ వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. వారు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలని ఆయనకు సూచించారు. దీంతో తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు రోహిణి ముందుకొచ్చారు. తన ప్రాణం కాపాడుకొనేందుకు కుమార్తె కిడ్నీని స్వీకరించేందుకు లాలూ నిరాకరించినట్లు సమాచారం. కానీ, కుమార్తె ఒత్తిడి చేయడంతో పాటు, కుటుంబ సభ్యుల కిడ్నీని అమరిస్తే శస్త్రచికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన అంగీకరించాల్సి వచ్చింది. ఆపరేషన్ కోసం లాలూ నవంబర్ 20-24 మధ్య సింగపూర్ కు వెళ్లే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా తన కిడ్నీ, గుండె సమస్యలకు లాలూ దిల్లీలోని ఎయిమ్స్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్లు ఆయనకు కిడ్నీ మార్పిడిని సూచించలేదు. కానీ, తండ్రి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందిన రోహిణి.. ఆయన్ను సింగపూర్ లోని వైద్య బృందానికి చూపించింది. వారు లాలూకు కిడ్నీ మార్పిడి సూచించారు. లాలూ కిడ్నీ ఆపరేషన్ నవంబర్ లో జరుగుతుందని ఆయన కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం లాలూ ఢిల్లీలోని తన పెద్ద కుమార్తె మీసాభారతి ఇంట్లో ఉంటున్నారు.