మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మనం ఏదైనా పనిని తలపెట్టినప్పుడు పూర్తి చేసే వరకు వెనుతిరగకుండా చేసే ప్రయత్నానికి భగీరధుడే ఆదర్శమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై భగీరథుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తలపెట్టిన పని పూర్తి చేసే ప్రయత్నంలో భగీరధుడిని ఆదర్శంగా చూపుతామని అన్నారు. పురాణాలలో సూర్యవంశపు రాజైన సగరుడు తలపెట్టిన అశ్వమేధ యాగంలో వదిలిన గుర్రాన్ని పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో బంధించినప్పుడు సగరుని కుమారులైన 60 మంది అశ్వాన్ని తీసుకురావడానికి వెళ్లి మహర్షి ఆగ్రహంతో బూడిదగా మారుతారని, అప్పుడు సగరుని ముని మనవడు అయిన భగీరథుడు బూడిదగా మారిన వారికి విముక్తి కలిగించడానికి ప్రయత్నం ప్రారంభించి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి గంగను భూమిపైకి తీసుకువస్తే ముక్తి లభిస్తుందని చెప్పగా హిమాలయాల్లో తపస్సు చేసి గంగను తనతో భూమి పైకి రావాలని ఒప్పించగా, తన దూకుడు శక్తిని భూమి తట్టుకోవడం కష్టమని, జడలు కట్టిన జుట్టు, నీల కంఠం ఉన్న శివుడికి మాత్రమే దానికి నిలబడే శక్తి ఉందని, శివుని అనుగ్రహం పొందమని తెలుపగా తపస్సు చేసి శివ అనుగ్రహంతో గంగను భూమి పైకి తీసుకువచ్చి సగరుని పుత్రులకు విముక్తి కలిగించాడని, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదురైనా తలపెట్టిన పనిని పూర్తి చేయడానికి భగీరథుని ఆదర్శంగా చూపుతారని తెలిపారు. భగీరధుడిని స్ఫూర్తిగా తీసుకొని మొదలుపెట్టిన పనిని ఎన్ని అడ్డంకులు వచ్చిన పూర్తి చేసేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..