ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమెల్యే బాల్క సుమన్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని మందమర్రి మండలం వెంకటాపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. శనివారం అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాసు శివయ్య, మాసు రాజ్యలక్ష్మీ అలియాస్ పద్మ, కోటపల్లి మండలం కొండంపేట్ గ్రామానికి చెందిన మౌనిక, తన కూతుర్లు స్వీటీ, హిమబిందు, సింగరేణి కార్మికుడు శాంతయ్య మృతి చెందడం జరిగిందని, ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని తెలిపారు. ప్రమాదంపై విచారణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటూ అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు.