Telugu Updates
Logo
Natyam ad

ఆ లింకులను బ్లాక్ చేయండి.. ట్విటర్, యూట్యూబ్ కు కేంద్రం ఆదేశాలు..!

బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం మరికొన్ని చర్యలు చేపట్టింది. దానికి సంబంధించిన లింకులను బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది.

ఆంజనేయులు న్యూస్, ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ పై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం రాజేసింది. దీనిపై ఇదివరకే కేంద్రం తీవ్రంగా స్పందించగా.. తాజాగా మరికొన్ని చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ డాక్యుమెంటరీ లింకులను బ్లాక్ చేయాలని ట్విటర్ యూట్యూబ్ లను కేంద్రం ఆదేశించినట్లు ఆ వర్గాల సమాచారం. 2002 గుజరాత్ అల్లర్లలో కొన్ని కోణాలను అధ్యయనం చేసి వాటి ఆధారంగా ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ దానిని రూపొందించింది. దానిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ డాక్యుమెంటరీని ఒక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ‘ఇది ఒక ప్రచార కార్యక్రమం. వారు ఎంచుకున్న కోణాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే దీన్ని రూపొందించారు’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ లింకులను బ్లాక్ చేయాలని ఆ రెండు సామాజిక మాధ్యమ సంస్థలను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. దానిపై వచ్చిన 50 ట్వీట్లను తొలగించాలని చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ట్విటర్ తొలగించిన వాటిలో తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రీన్ ట్వీట్ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ డాక్యుమెంటరీ అంశాన్ని పాకిస్థాన్ మూలాలున్న ఎంపీ ఒకరు బ్రిటన్ పార్లమెంట్ లో లేవనెత్తగా. ఆ విషయాలను తాను పూర్తిగా అంగీకరించలేనని ప్రధాని రిషి సునాక్ స్పందించిన సంగతి తెలిసిందే.