ఎన్నికలు రాకముందే ఆ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం.!

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే వరంగల్​ జిల్లా చెరువుకొమ్ము తండా సర్పంచ్ ఏకగ్రీవమయ్యాడు. సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి పండగ, పోచమ్మతల్లి, ఆంజనేయుడికి మూడు గుళ్లు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి ఖర్చు కోసం ఇంటింటికి రూ.1000 చొప్పున పంచుతానని దరావత్​ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. అందుకుగానూ సర్పంచ్​ ఎన్నికల్లో ఎవరూ పోటీచేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్​పెట్టాడు. అయితే మాట తప్పితే ఎలా అని గ్రామస్థులు బాలాజీని ప్రశ్నించడంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తిచేస్తానని మాట ఇచ్చాడు బాలాజీ. దీంతో సోమవారం ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్​ పెట్టుకుని అగ్రిమెంట్​పేపర్​ రాసుకున్నారు. ఒప్పందం ప్రకారం.. గడువులోగా పనులు పూర్తయితే బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలి. దీనిని ఒకవేళ ఎవరైనా అతిక్రమించి నామినేషన్ వేస్తే.. బాలాజీకి రూ.50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్ లో రాసుకున్నారు. అగ్రిమెంట్ పై ఇరుపక్షాలవారు సంతకాలు చేయగానే సర్పంచ్​అభ్యర్థితోపాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని, వేడుకలు చేసుకున్నారు. కాగా చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా ఉన్నారు.

Comments (0)
Add Comment